జనగామ: ధాన్యం తరుగు విషయంలో తేడాలొస్తే సహించేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Dayakar rao) అధికారులను హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో (Paddy procurement) రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ (CM KCR) ధాన్యం కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ధాన్యం కొనుగోలు తీరును గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పంటల విషయంలో అకాల వర్షాల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పంటల నష్టాలకు పరిహారం ఇవ్వడంతో పాటు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని మంత్రి వెల్లడించారు. తడిసిన ధాన్యానికి సైతం మద్దతు దొరకే లభించేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని, రైతులకు అండగా నిలవాలని సూచించారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావులేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులకు సహకరించాలని కోరారు.