జనగామ: గ్రామాల అభివృద్దే దేశాభివృద్ది అని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచి నీటి సరఫరా, శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం బంజరలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి దేశంలో ఎక్కడాలేని విధంగా తండాలను గ్రామ పంచాయతీలుగా అప్గ్రేడ్ చేసిందని మంత్రి చెప్పారు.
గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, రైతు వేదికలు ఏర్పాటు చేశామని అన్నారు, అంతే కాకుండా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు భవనం లేని గ్రామాలకు భవన నిర్మాణాలు చేపడుతూ గతంలో ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని వెల్లడించారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు వేదికలు, రైతు భీమా, 24 గంటల విద్యుత్తు ఇస్తూ వివిధ పంటలకు మద్దతు ధర కల్పిస్తూ రైతులకు సాగునీరు అందించేందుకు చెక్ డ్యాములు, ప్రాజెక్టులు, నిర్మించామన్నారు.
మిషన్ భగీరథ ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు, కరోనా సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా వారి వారి ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమచేసామని గుర్తుచేశారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, నర్సరీ ప్రారంభించి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 21 లక్షల 48 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని 32 మంది లబ్దిదారులకు పంపిణీ చేసారు.
గ్రామ పంచాయతీ కార్యాలయానికి భూమిని విరాళంగా ఇచ్చిన దాతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య మాట్లడుతూ గ్రామాలన్నీ బాగుపడి సమగ్రంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గ్రామాల అభివృద్ధికి అనేక పథకాల ద్వారా నిధులు నేరుగా మంజూరు చేస్తున్నారని, అందువల్ల గ్రామ ప్రజలు సమన్వయంతో కలిసి పనిచేసి గ్రామాభివృద్దికి తోడ్పడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జనగామ ఆర్డీవో మధుమోహన్, డీపీఓ కె.రంగాచారి, జెడ్పీ సీఈఓ ఎల్. విజయలక్ష్మీ, ఎంపీపీ బస్వ సావిత్రీ మల్లేశం, స్థానిక జెడ్పీటీసీ పల్లవి, బంజర సర్పంచ్ మాలోతు కవిత మధు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.