హైదరాబాద్: ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేవలం ఆసరా పింఛన్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.971 కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి ఆసరా పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఎర్రబెల్లి సమాధానం ఇచ్చారు.
ఆసరా పెన్షన్ వయస్సు తగ్గించిన తర్వాత లబ్దిదారుల సంఖ్య 44,12,882కు చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.200 మాత్రమే పెన్షన్ అందిస్తున్నదని, అదికూడా 6 లక్షల 66 వేల మందికేనని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం 44 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నదని వెల్లడించారు. సీఎం కేసీఆర్ మనసున్న మారాజు కాబట్టే.. జనం మనసెరిగి ఆసరా పెన్షన్ ఇస్తున్నారని తెలిపారు.