హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అన్నిరంగాల్లో తెలంగాణ (Telangana) అగ్రగామిగా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అప్రతిహత అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు. అమెరికా (America), భారతదేశాల (India) మధ్య వారథులుగా ఎన్ఆర్ఐలు (NRI) ఉన్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎన్ఆర్ఐలు ఛోదక శక్తులు కావాలన్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరుగుతున్న తానా (TANA) మహాసభలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఫిలడెల్ఫియాలో ఉన్న సాయిదత్త ఆలయాన్ని దర్శించారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తానా మహాసభలు అత్యంత వైభవోపేతంగా జరిగాయన్నారు. తమకు ఆతిథ్యం ఇవ్వడానికి అమెరికా నలుమూలల నుంచి వచ్చిన తెలుగు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మనం ఎక్కడున్నా దేశ భక్తిని, కన్న తల్లిని, పుట్టిన ఊరిని మరచిపోలేదని చెప్పారు. మన పనితనంతో వలస వెళ్లిన దేశం, స్వదేశానికి, రాష్ట్ర, గ్రామ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నామన్నారు. దేశ సంపద పెంపులో, నిర్మాణంలో మనమే ముందున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇది మరింతగా కొనసాగాలని సూచించారు. దేశాల మధ్య వారధులుగా, అభివృద్ధి సారథులుగా నిలవాలని చెప్పారు. సీఎం కేసీఆర్ అధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని వెల్లడించారు.