హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మెను జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (JPS) వెంటనే విరమించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. జేపీఎస్లను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని జరుగుతున్న ప్రచారం నిజం కాదని చెప్పారు. అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు. ప్రభుత్వం తరఫున తానుగానీ, మరెవరూ గానీ వారిని చర్చలకు పిలువలేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె (Strike) విరమించి విధుల్లో చేరితే బాగుంటుందన్నారు. వారిపై ముఖ్యమంత్రి కేసీఆర్కు (CM KCR) మంచిఅభిప్రాయం ఉందని, దానిని చెడగొట్టుకోవద్దని సూచించారు.
ప్రభుత్వాన్ని శాసించాలని సాహసించడం, నియంత్రించాలని అనుకోవడం తప్పని వెల్లడించారు. వారు సమ్మెచేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. సంఘాలు కట్టబోమని, యూనియన్లలో చెరబోమని, సమ్మెలు చేసేదిలేదని, ఎలాంటి డిమాండ్లకు దిగమని ప్రభుత్వానికి బాండ్ రాసిచ్చారని, ఇప్పుడు ఆ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న తీరు బాగాలేదన్నారు. పైగా సోషల్మీడియాలో జరుగుతున్న వెంటనే ప్రచారాన్ని నిలిపివేయాలి సూచించారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.