పాలకుర్తి రూరల్, నవంబర్ 15 : కాంగ్రెసోల్లు(Congressmen) దొంగలని, వారు పాలించే రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli) అన్నారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో గొల్లకుర్మల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తొలుత గొల్లకుర్మలు ఒగ్గు డోలు విన్యాసాలు, బోనాలు, శివసత్తుల పూనకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మంత్రి ఎర్రబెల్లికి మేకపిల్ల, గొంగడి బహూకరించారు.
అనంతరం దయాకర్రావు మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన సారథి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ఆలోచించి వేయాలని, తొందరపడి ఓటు వేయొద్దన్నారు. ప్రజల కోసం పని చేసే నాయకులకు మాత్రమే ఓటు వేయాలన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన లో గొల్లకుర్మలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గొల్ల కుర్మలకు అండగా నిలిచింది సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గొర్రెల యూనిట్ల ను అత్యధికంగా పాలకుర్తిలో పంపిణీ చేశానన్నారు.
మూడు పంటలు కావాల్నా…మూడు గంటల కరెంట్ కావాల్నా అని అడిగారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. 10హెచ్పీ మోటర్ పెట్టి మూడు గంటల కరెంట్ ఇస్తా అని మాట్లాడడం సిగ్గుచేటని, ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఆపత్కాలంలో అండగా ఉన్నానని, గొల్ల కుర్మలు తనకు అండగా ఉంటే నేను వారికి అండగా నిలుస్తానన్నారు.
రెండో విడత గొర్లు అందరికి ఇప్పిస్తాన న్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాను 70వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు , ఎన్నారై ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి , గొల్లకుర్మ సంఘం నాయకులు పండుగ నారాయణ, చిలువేరు పెంటయ్య, బొమ్మరబోయిన నాగరాజు, మాజీ కల్నల్ ప్రముఖ వైద్యుడు మాచర్ల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.