Minister Dayakar Rao | పాలకుర్తి : వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయానికి భద్రాద్రికి మించిన వైభోగం దక్కేలా అభివృద్ధి చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. భద్రాద్రి ఉన్నంత చరిత్ర వల్మిడి ఆలయానికి ఉందన్నారు. మిగతా దేవాలయాలకు భిన్నంగా ఈ ఆలయానికి ఎకరాల కొద్ది స్థలం ఉందని, దాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసే అవకాశం మెండుగా ఉందన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా జనగామ జిల్లాలోని వల్మిడి సీతారామస్వామి ఆలయం కల్యాణోత్సవాల ఏర్పాట్లపై మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాముడు నడయాడిన నేలగా, రామాయణకర్త వాల్మీకి మహర్షి తపస్సు చేసిన గుట్టగా వల్మిడి చరిత్ర, గుర్తింపు, గౌరవం ఉన్నాయన్నారు. గుట్టను విస్తృతంగా అభివృద్ధి చేస్తూ దేవాలయంలో రూ.11.40 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. కళ్యాణ మండపం, గుట్ట మీదకు రోడ్డు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ సైతం పాలకుర్తి, బమ్మెర, వల్మిడి గ్రామాలను కలుపుతూ ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారన్నారు.
గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో వల్మీడి దేవాలయంలో ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు శ్రీ సీతారామచంద్రస్వామిల కల్యాణం కనుల పండువగా నిర్వహించనున్నామన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నవమి నాటికి కల్యాణ మండపాన్ని సిద్ధం చేయాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేకంగా 15 మొబైల్ టాయ్లెట్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యతలను ఆయా విభాగాల అధికారులకు అప్పగించారు. నవమి రోజున భక్తులకు అన్నదానం చేయనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు భక్తులంతా సకుటుంబ సపరివాతర సమేతంగా రావాలని ఆహ్వానించారు. మరో వైపు ఉత్సవాల కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రూ.5లక్షలు విరాళం ప్రకటించారు. కళాకారులతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో కళాకారులతో వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. దేవస్థాన ధర్మకర్తల మండలి అధికారులు సమన్వయంతో పని చేస్తూ వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకొని ఆయా కమిటీల ఆధ్వర్యంలో ఆయా పనులను సరిగ్గా నిర్వర్తిస్తూ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సమగ్రంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.