హైదరాబాద్, మే 26(నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతిని విజయవంతం చేయడంలో జడ్పీ చైర్మన్లు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరుగుతానని తెలిపారు. అందరం కలిసి కట్టుగా పల్లె ప్రగతిని విజయవంతం చేద్దామని, పల్లె ప్రగతి ద్వారా దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. గురువారం రాజేంద్రనగర్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో పల్లె ప్రగతి 5వ విడత నిర్వహణపై జడ్పీ చైర్మన్లు, సీఈవోలతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మన రాష్ట్రాన్ని, మన గ్రామాలను నెంబర్ వన్గా తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్దేనన్నారు.
ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల్లో మన గ్రామాలే నెంబర్ వన్గా ఉన్నాయని తెలిపారు. జడ్పీ చైర్మన్లు, జడ్పీ సీఈవోలు గ్రామాల్లో పర్యటించాలని, పల్లె ప్రగతి మొదటి రోజు గ్రామాల్లో పాదయాత్రలు, పల్లె ప్రగతి గురించి ప్రజలకు తెలిసేలా ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సమీక్షలో జడ్పీ చైర్మన్లు, చైర్పర్సన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సల్తానియా, కమిషనర్ శరత్, ప్రత్యేక కమిషనర్ ప్రసాద్, పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్, వెస్లీ, గ్రామీణాభివృద్ధి జేసీ జగత్కుమార్రెడ్డి పాల్గొన్నారు.