Minister Dayakar Rao | తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం పాలకుర్తి నియోజకవర్గ స్థాయి సాగునీటి దినోత్సవ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం క్రాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో జరిగింది. కార్యక్రమానికి మంత్రి దయాకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నీటి పారుదలశాఖ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు.
అలాగే ఆడియో, విజువల్ను చూశారు. సంబంధిత శాఖ అధికారులను అభినందించారు. మా తెలంగాణం కోటి ఎకరాల మాగణం అనే ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గానికి సాగు, తాగు నీరు అందక తీవ్ర కరువులో ఉండేదని, తెలంగాణ వచ్చాకే నియోజకవర్గం సైతం సస్యశ్యామలమవుతుందని చెప్పారు. రాష్ట్రం, ఉమ్మడి వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టిన పలు సాగు నీటి పనులు, సాగులోకి వచ్చిన ఆయకట్టు వివరాలను వివరించారు.
అలాగే కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశానికి ఈ దుర్గతి పట్టిందని, వారు పాలించే రాష్ట్రాల్లో ఏమీ చేయలేని దద్దమ్మలు, తెలంగాణలో ఏమో చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అలాంటి వారిని ఇప్పటిదాకా భరిస్తూ వస్తున్నామని, ఇక నుండి వాళ్లని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇవ్వని, ఇచ్చిన హామీలను నెరవేర్చి, ప్రజల అభివృద్ధి, సంక్షేమంలో, దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. ఆయన ప్రజల కోసం చేసిన మేలును చూసి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి రంగంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు.