Iftar Party | జనగామ జిల్లా పాలకుర్తి భారారత్ గార్డెన్లో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు చెందిన ముస్లింలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మత విద్వేశాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. తెలంగాణలో హిందూ ముస్లింలు కలిసిమెలసి ఉంటున్నారన్నారు. సర్వమత సామరస్యాన్ని తెలంగాణ తెలంగాణ చాటిందని, సీఎం కేసీఆర్ అందరినీ, అన్ని మతాలను సమానంగా చూస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ తరచూ చెప్పే, తెలంగాణకే తల మానికమైన ‘గంగజమునా తెహజీబ్’ మరింతగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.
తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే ప్రజల పండుగలు నిర్వహించే గొప్ప సంస్కృతిని కేసీఆర్ ప్రారంభించారని కొనియాడారు. ముస్లింల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రంజాన్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ ప్రతి ఏటా రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మంది ముస్లింలకు దుస్తులను, రంజాన్ కానుకలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పేదింటి ముస్లిం మహిళల వివాహం కోసం రాష్ట్ర ప్రభుత్వం షాదీ ముబారక్ కింద ఆర్థిక సాయం అందిస్తుందని గుర్తు చేశారు. హైదరాబాద్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి రూ.40కోట్ల మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.