తొర్రూరు, ఏప్రిల్ 10: దేశంలోని ఏ రాష్ట్రానికి దక్కని విధంగా పంచాయతీరాజ్ శాఖలో కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించిందని, దీన్ని చూసైనా రాష్ట్ర బీజేపీ నాయకులు కండ్లు తెరువాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని మిషన్ భగీరథ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లెప్రకృతి కార్యక్రమాల వల్లే గ్రామాలు ప్రగతి పథంలో నడుస్తున్నాయన్నారు. తెలంగాణలో పాలనకు ఈ అవార్డులే నిదర్శనమని తెలిపారు. గతంలో 12, ఈ సారి 19 అవార్డులు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.
పల్లెల ప్రగతికి ప్రతి నెలా రూ.500 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. దీంతో మౌలిక వసతుల కల్పన, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటిక, సీసీ రోడ్డు తదితర నిర్మాణాలు చేపడుతూ ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ను ఇవ్వడంతో పారిశుద్ధ్య పనులు సమర్థవంతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో అభివృద్ధి వేగంగా కొనసాగుతుందన్నారు. రాష్ట్ర పాలనను కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుంటూ అవార్డులు ఇస్తుంటే ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్కు ఎవరూ సాటిలేరు: కేటీఆర్
అవార్డులు లభించిన అంశంపై ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తంచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్కు, సీఎం కేసీఆర్కు ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. అద్భుతంగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘గ్రామీణాభివృద్ధి అయినా, పట్టణాభివృద్ధి అయినా తెలంగాణ సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సమ్మిళిత వృద్ధి మోడల్కు ఎవరూ సాటిలేరు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయన బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సిరిసిల్ల జిల్లా పరిషత్తుకు ప్రత్యేక అభినందనలు’ అని ట్వీట్ చేశారు.