ముత్తారం, పాలకుర్తి (పాలకుర్తి నియోజకవర్గం), జులై 17 : ఒకప్పుడు కరెంటు కష్టాలకు కారణమే కాంగ్రెస్. అసమర్థ, దుష్ట పాలన వల్ల రైతులు అరిగోస పడ్డారు. అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారు. అయినా బుద్ధిరాలేదు. రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. వ్యవసాయానికి కేవలం 3 గంటల కరెంటు చాలట. వ్యవసాయం గురించి తెలిసినోడు మాట్లాడే మాటలేనా? కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలతో రైతులు నవ్వుకుంటున్నారు. నవ్వులపాలైన ఆ పార్టీని పాతాళంలో పాతి పెట్టాలని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిప్పులు చెరిగారు.
రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలం, ముత్తారం, పాలకుర్తి రైతు వేదికల వద్ద రైతులతో కలిసి నిర్వహించిన సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కాంగ్రెస్ వ్యాఖ్యలపై కన్నెర్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ మూర్ఖంగా మాట్లాడుతున్నది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నది. ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నదని మండిప్డారు.
దున్నపోతు ఈనింది అంటే.. దొడ్లో కట్టేయమన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు, స్టాటర్లు, ఎండిపోయిన పైర్లు అసెంబ్లీలో ప్రదర్శించి, అల్లరి చేసే పరిస్థితి నాడు ఉండేది. వాటితోనే అసెంబ్లీ దద్దరిల్లేది. వ్యవసాయం దండుగ అనేది.
ఎరువులు, విత్తనాల కొరత, నకిలీలు, సాగునీరు లేక, కరెంట్ రాక అంతా ఆగమాగం ఉండేది. రైతులు అత్మహత్యలు చేసుకునే దుర్మార్గ పాలన అనాడు సాగింది. ఎండాకాలంలో గ్రామాలకు రావాలంటేనే ప్రజాప్రతినిధులు భయపడేవారు అని ఆనాటి పరిస్థితులను మంత్రి రైతులకు వివరించారు.అందుకే 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడారని తెలిపారు.కాగా, పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు.