హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం వరంగల్ – ఖమ్మం రహదారిలో పంథిని సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి దయాకర్రావు అదే సమయంలో మునుగోడు పర్యటన ముగించుకొని.. పర్వతగిరిలో ఓ కార్యక్రమంలో పాల్గొని హన్మకొండకు వెళ్తున్నారు.
తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చూసి వెంటనే.. కాన్వాయ్ని ఆపి, సహాయక చర్యలు చేపట్టారు. తన సిబ్బంది, అక్కడకు చేరిన మరికొందరి సహాయంతో గాయపడిన వ్యక్తిని వెంటనే తన కాన్వాయ్ లోని ఒక వాహనంలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎం సూపరింటెండెంట్ వలపదాసు చంద్రశేఖర్కు ఫోన్ చేసి, ఆ క్షతగాత్రుడికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని రమేశ్గా గుర్తించారు.