Minister Errabelli Dayakar Rao | హైదరాబాద్, జూన్ 13: మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి కొత్తకోట దయాకర్ రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగానికి గురయ్యారు. ఆప్తమిత్రుడిని కోల్పోయానంటూ కంటతడి పెట్టారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. అనంతరం కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డిని పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలిపారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొత్తకోట దయాకర్ రెడ్డి హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దయాకర్రెడ్డి మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సంతాపం వ్యక్తం చేశారు.