గోవిందరావుపేట, నవంబర్ 21: నాడు ఎన్టీఆర్, నేడు సీఎం కేసీఆర్ ఇద్దరూ మహనీయులని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో వీరపనేని శివాజీ జ్ఞాపకార్థం కొడుకులు, కోడళ్లు రామకృష్ణ-సునీత(సినీ గాయని), రవికాంత్-సుధారాణి, సతీమణి భాగ్యలక్ష్మి ఏర్పాటు చేయించిన ఆయన విగ్రహాన్ని సోమవారం మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ గోవిందరావుపేటను మండలకేంద్రంగా ఏర్పాటు చేస్తే నేటి సీఎం కేసీఆర్ ములుగును జిల్లాగా ప్రకటించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. శివాజీ 75వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. సీఎంగా ఉన్న ఎన్టీఆర్.. శివాజీ కృషితో స్థానికంగా 400 ఇండ్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత తదితరులుపాల్గొన్నారు.