Minister Dayakar Rao | పారిశుధ్య కార్మికులు ఎవరి మాటలో విని ఆందోళన చేయొద్దని.. ఆగంకావొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. సీఎం కేసీఆర్ మనసున్న మహరాజని, తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కార్మికులకు వేతనాలున్నాయన్నారు. ఉన్న మంచిపేరును చెడగొట్టుకోవద్దని సూచించారు. వెంటనే ఆందోళనను విరమించుకోవాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులకు వేతనాలు అందుతాయన్నారు.
గత ప్రభుత్వాల్లో రూ.500, రూ.1000 కూడా లేని కార్మికులకు వేతనాలను తెలంగాణ తర్వాత రూ.8500 పెంచారన్నారు. దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా రూ.1000 పెంచిన ఘనత కేసీఆర్దేనన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పారిశుధ్య కార్మికులను అవమానకరంగా చూస్తున్నారని, యూపీలో 5200, ఏపీలో రూ.6వేలు ఇస్తున్నారన్నారు. ఛత్తీస్గఢ్లో పంచాయతీల నుంచే చెల్లిస్తున్నారన్నారు. పశ్చిమ బెంగాల్లో పెయిడ్ వర్కర్స్గా గుర్తించి రూ.500 మాత్రమే ఇస్తున్నారన్నారు. కేరళలో సానిటేషన్ వర్కర్స్ పేరుతో ఇంటికి రూ.30 వసూలు చేస్తున్నారని, ఒక్కో వార్డులో పని చేసే కార్మికుడికి రూ.4వేల రూ.5వేలకు మించి రావడం లేదన్నారు. దేశమంతా ఇలా ఉంటే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పారిశుధ్య కార్మికుల గౌరవం పెంచి.. గ్రామాలు, పట్టణాలను స్వచ్ఛంగా మార్చి దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు.
ఈ విజయంలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు, మల్టీ పర్పస్ వర్కర్ల పాత్ర అమోఘమన్నారు. పనికి మాలిన కొన్ని పార్టీలు చేసే క్షుద్ర, స్వార్థ రాజకీయాల వలలో పడొద్దని సూచించారు. ఇప్పటి వరకు ఉన్న పేరును చెడగొట్టుకోవద్దని, ధర్నాలు, ఆందోళనకు దిగవద్దని కోరుతున్నారన్నారు. కొందరు క్వాలిఫైడ్ కార్మికులను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తింపునివ్వాలని కోరుతున్నారని, కార్మికుల ఇతర డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దృష్టిలో అన్ని విషయాలు ఉన్నాయని, సమయానుకూలంగా స్పందిస్తారని, అప్పటి వరకు కార్మికులు ఓపిక పట్టాలని, ఆందోళన విరమించాలని సూచించారు.