హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు కేటాయించాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, కొత్త రోడ్ల పనుల పురోగతి, ఉపాధి హామీ పథకం పనిదినాలు, పనులు, నిధులపై సోమవారం అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్లోని మంత్రి చాంబర్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, డైరెక్టర్ హన్మంతరావు, ఉపాధి, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ ప్రసాద్తో జరిగిన ఈ సమీక్షలో మంత్రి మాట్లాడారు.
పంచాయతీరాజ్శాఖ సీసీ రోడ్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు టెండర్లు పిలువని జిల్లాల్లో వెంటనే పిలువాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది ఇప్పటికే 10.5 కోట్ల పనిదినాలు పూర్తి చేశామని, వచ్చే ఏడాదికి 12 కోట్ల పనిదినాలకు పెంచాలని కేంద్రానికి పంపనున్న ప్రతిపాదనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన దాదాపు రూ.800 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధుల విడుదలకు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఆ తర్వాత ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా అన్ని జిల్లాల డీఆర్డీవోలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామపంచాయతీల పరిధిలో ఉపాధి పనులను విధిగా ప్రారంభించాలని, ప్రతి జిల్లాలో 10వేల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యేలా కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు.