తొర్రూరు ( మహబూబాబాద్ ):అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటీఆర్(Minister KTR) పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆదివారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తొర్రూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని, అనంతరం 20 వేల మంది మహిళలతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ లో కేటీఆర్ మాట్లాడతారని మంత్రి తెలిపారు. అదే రోజు కేటీఆర్ నోట డ్వాక్రా మహిళలకు శుభ వార్త చెప్పే అవకాశం ఉందని వెల్లడించారు. అనంతరం పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి, హెలిప్యాడ్, బహిరంగ సభా స్థలం, పార్కింగ్ స్థలాలను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు.
కేటీఆర్ రాక సందర్భంగా తొర్రూరు పట్టణ అభివృద్ధికి కావాల్సిన మరిన్ని నిధులు, అవసరాల గురించి మాట్లాడారు. అధికారులు, పార్టీ శ్రేణులకు అంశాల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఈ సమీక్ష, ఆయా స్థలాల పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఆర్డీవో, ఆర్డీవో, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.