జనగామ/సూర్యాపేట : పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆపదలో ఉన్న వారిని ఆదుకొని మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద గల నెల్లుట్ల ఫ్లైఓవర్ పై రెండు ద్విచక్ర వాహనాలు డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
అటుగా వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి తన కాన్వాయ్ను ఆపారు. వెంటనే డీసీపీ, పోలీస్ లకు ఫోన్ చేసి సహాయక చర్యలు చేపట్టారు. పోలీస్ లను చూసిన వెంటనే ఇద్దరు యువకులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. అనుమానం వచ్చిన పోలీసులు పట్టుబడిన యువకుడిని విచారించారు. అతడి వద్ద ఉన్న సంచులను చెక్ చేశారు. అందులో గంజాయి ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని విచారణ కోసం స్టేషన్ కి తీసుకెళ్లారు. గాయపడిన యువకులను జనగామ హాస్పిటల్ కి పంపించారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
క్షతగాత్రులను దగ్గరుండి జనగామ దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ, యాదృచ్ఛికంగా జరిగిన ఘటనలో గంజాయి పట్టుబడటం ఆశ్చర్యంగా, ఆందోళన గా ఉందన్నారు. అందులోనూ యువకులు పట్టుబడటం చూస్తే, ఇబ్బందిగా ఉందన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడటం మంచిది కాదని, ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు మంచి దారిలో పయనించాలని అన్నారు.
కాగా, మరొక సంఘటనలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రమాద బాధితులకు అండగా నిలిచి శభాష్ అనిపించుకున్నారు. సూర్యాపేట – జనగాం రహదారి మార్గమధ్యంలోని జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామం వద్ద బైక్, ఆటో ఢీ కొన్నాయి.
ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. కాగా, అదే మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్యే గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్న వారిని గమనించి వెంటనే ఆగిపోయారు. క్షతగాత్రుల కోసంవాహనం ఏర్పాటు చేసి వారిని సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్కు సూచించారు.