హన్మకొండ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు అర్థం ఉందా?.. ఎవరిని మభ్యపెట్టేందుకు దీక్ష చేస్తున్నారంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. గురువారం ఆయన హన్మకొండలో ఆయన పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. ధాన్యం కొనబోమని చెప్పింది ఎవరు?.. కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. అయినా రైతుల శ్రేయోభిలాషిగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. దమ్ముంటే బండి సంజయ్ ధాన్యం కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టాలని హితవు పలికారు.
తెలంగాణలో పండించే ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని కేంద్రం నుంచి ఉత్తర్వులు తీసుకురావాలని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి లేఖ తీసుకువస్తే నీకు దండం పెడుతాం.. నీ కాళ్లు మొక్కుతా.. అంటూ బండికి సవాల్ విసిరారు. రైతుల విషయంలో కేంద్రానిది దొంగ ప్రేమ, కపట నాటకమన్నారు. రైతుల జీవితాలతో కేంద్రం ఆటలాడుతోందని విమర్శించారు. వానాకాలం మొదవడానికి ముందే నాలుగు నెలలుగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించలేదన్నారు.
హుజూరాబాద్ ఎన్నికల కోసమే బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల కోసం, వ్యవసాయరంగం అభివృద్ధికి కృషి జరుగుతుందన్నారు. రైతుల బాధలు తెలిసిన సీఎం కాబట్టే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు చూపించాలని డిమాండ్ చేశారు. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొని.. రైతులను తొక్కించి చంపుతోందని ఆరోపించారు. వానాకాలంలో రైతులు పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 7,256 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్, సాగునీరు అందిస్తున్నది సీఎం కేసీఆర్ అన్నారు. ధాన్యం నిలువలు పెంచింది తెలంగాణ ప్రభుత్వమని, రాష్ట్రంలో రైతులను అనేక విధాలుగా ఆదుకుంటున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక సమస్యలు సృష్టిస్తుందని ఆరోపించారు. బండి సంజయ్ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్కు సిద్ధంగా ఉన్నారా..? అని ప్రశ్నించారు.