హైదరాబాద్ : తెలంగాణకు ప్రధాని మోదీ రావడాన్ని తాము తప్పుపట్టడం లేదని, అయితే ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునర్విభజన చట్టంలోని హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి మోదీ అని విమర్శించారు. బీజేపీ నేతలకు మాట ఇచ్చి తప్పడం అలవాటని, వివిధ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ ఏమన్నాడో ఆ తర్వాత ఏ విధంగా మాట తప్పారో చూశామని గుర్తు చేశారు. పంచాయతీరాజ్ శాఖ పనితీరుకు కేంద్రం నుంచి అవార్డులు వచ్చాయి కానీ.. నిధులు రాలేవన్నారు.
పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వకుండా కోత విధిస్తోందని, కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల వరకు కోత విధించిందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి సైతం మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకంలో లోపాలు వెతికి పట్టుకునేందుకు 18 కేంద్ర బృందాలు వచ్చాయని, ఆ బృందాలు అన్ని బాగున్నాయి ప్రశంసించాయన్నారు. అయితే, పనులకు అనుమతి తీసుకోలేదని చెప్పాయని, మొక్కలు నాటేందుకు కేంద్రం అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పథకాలకు కేంద్రం అడ్డుపుల్లలు వేస్తోందని, ఉపాధి హామీ పథకానికి రూ.70వేల కోట్ల కోత విధించగా.. తెలంగాణలో రూ.800 కోట్ల కోత విధించిందని ఆరోపించారు. రాష్ట్రానికి ఇంతగా మోసం చేసిన మోదీ.. ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారన్నారు. 2014లో ప్రధాని కాకముందు ఎల్బీ స్టేడియంలో పెట్టిన సమావేశంలో మోదీ పక్కన నేనున్నానని, అప్పుడు రూ.450గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.200 చేస్తామని హామీ ఇచ్చారని.. ప్రధాని అయ్యాక రూ.1200 వరకు పెంచారన్నారు. అన్ని హామీల విషయంలో మోదీది ఇదే వైఖరని విమర్శించారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం గతంలో ధర్నా చేసిన బీజేపీ కిషన్ రెడ్డి ఇప్పుడు సాధ్యం కాదంటారా? అని ప్రశ్నించారు. గిరిజన విశ్వ విద్యాలయం విషయంలోనూ బీజేపీది మోస పూరిత వైఖరి అని మండిపడ్డారు. మునుగోడులో బీజేపీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని, కేసీఆర్ను వేరే రాష్ట్రాలకు తిరగనివ్వొద్దని బీజేపీ కుట్రపన్ని కక్ష గట్టిందని ఆరోపించారు. తెలంగాణను బీజేపీ అన్ని రకాలుగా వేధిస్తోందని, ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీకి సంబంధం లేకుంటే సిట్ వద్దని హైకోర్టుకు ఎందుకు వెళ్లారని నిలదీశారు. మోదీపై బాధితులుగా ఉన్న ప్రజలే గళమెత్తుతారని, ఆయన పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని.. వారే తిరగబడుతారన్నారు. గవర్నర్.. గవర్నర్లా ఉండాలని, రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.