హైదరాబాద్, జనవరి 10(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డ్రైపోర్ట్ల ఏర్పాటు అంశంపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. డ్రైపోర్ట్ల ఏర్పాటుకు నల్లగొండతోపాటు కనెక్ట్ టు ఓల్డ్ ముంబై హైవే ప్రాంతాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐ భవన్లో మంత్రి శ్రీధర్బాబు ఎఫ్టీసీసీఐ, ఫికీ, సీఏఏ, ఎఫ్టీఎస్ఏసీ, డికీ తదితర సంఘాల ప్రతినిధులు, పారిశ్రామిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, త్వరలోనే నూతన పారిశ్రామిక పాలసీ తీసుకొస్తామని చెప్పారు. అర్బన్ క్లస్టర్, రీజనల్ క్లస్టర్, సెమీ అర్బన్ క్లస్టర్.. ఇలా మూడు పద్ధతుల్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తామని వివరించారు. హైదరాబాద్ను ఫార్మా ఇండస్ట్రీ హబ్గా ఇతర దేశాలు సైతం గుర్తిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్లో మిస్సైల్ తయారై.. ఇజ్రాయిల్కి ఎగుమతి అవుతున్నదంటే రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థంచేసుకోవచ్చునని పేర్కొన్నారు. తాము 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేరుస్తామని తెలిపారు. పారిశ్రామికరంగంలోనూ మరిన్ని లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు పారిశ్రామికవర్గాలు చొరువ చూపాలని కోరారు.
రాహుల్ వ్యతిరేకించింది అదానీనే..
అదానీ కంపెనీ వ్యవహారంలో కొంతమంది కావాలని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు. అన్ని వర్గాల పారిశ్రామికవేత్తలకు అవకాశం రావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని, తమ నాయకుడు రాహుల్గాంధీ అదానీని వ్యతిరేకించారు తప్ప అభివృద్ధిని కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అదానీతోపాటు అనేక ఇతర కంపెనీలు ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా వల్ల ఎంఎస్ఎంఈ పరిశ్రమలు చాలా ఇబ్బందిపడ్డాయని, అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు తోడ్పాటు అందిస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో అనేక పరిశ్రమలు ఏర్పడటమే కాకుండా ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినట్టు వివరించారు.