హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ (స్విట్జర్లాండ్) పర్యటనకు వెళ్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధమ్యాలను వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వేదిక ద్వారా ప్రపంచ దేశాలకు చాటిచెప్తామని, ఈ సందర్భంగా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం లాంటి కొన్ని రంగాలతోపాటు డాటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడుల కోసం ఎంవోయూలు కుదుర్చుకునే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే డబ్ల్యూఈఎఫ్ 54వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర అధికార బృందంతో కలిసి స్విట్జర్లాండ్కు వెళ్తున్న మంత్రి శ్రీధర్బాబు.. ఆ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
దావోస్లో తాము వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోర్జ్తోపాటు గూగుల్, ఉబర్, మాస్టర్కార్డ్, నోవార్టిస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజెనికా, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు, భారత్కు చెందిన టాటా, విప్రో, హెచ్సీఎల్, జేఎస్డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్టెల్, బజాజ్, సీఐఐ, నాస్కాం తదితర సంస్థలకు చెందిన 70 మందికిపైగా ప్రతినిధులతో భేటీ కానున్నట్టు వివరించారు.
డబ్ల్యూఈఎఫ్లో సీఎం ప్రసంగం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి హాజరు కానుండటం ఇదే తొలిసారని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ కాంగ్రెస్ సెంటర్లో జరిగే చర్చాగోష్ఠిలో ప్రసంగించాల్సిందిగా సీఎం రేవంత్రెడ్డిని, వైద్యరంగం పురోగతిపై ఆయన తన అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు అగ్రి-ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం, రైతుల జీవనోపాధిని పరిరక్షించడం, పర్యావరణ అనుకూల సాగు విధానాలను ప్రోత్సహించడంపై ప్రసంగిస్తారని వివరించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేయనున్న చర్చా వేదికలో ‘డెవలపింగ్ సిల్స్ ఫర్ ఏఐ’ అనే అంశంపై తాను మాట్లాడనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.