గొల్లపల్లి (ధర్మపురి) : పల్లెల్లో పిల్లలకు నాణ్యమైన సేవలను అందించేందుకు అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం గొల్లపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మహిళా శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమశాఖ జగిత్యాల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు పోషణ్ ట్రాకర్, ఆరోగ్యలక్ష్మి సంబంధిత డేటాను ఎంట్రీ చేసేందుకు మొబైల్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ సేవలు గ్రామాల్లో ఎంతో కీలకమని, వారు లేకుండా ఏ ఒక్క గ్రామాన్ని ఊహించలేమన్నారు.
వారి మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మొబైల్ ఫోన్ల ద్వారా డేటా ఎంటీ చేసే అవకాశం కల్పిస్తూ, వారందరికీ ఎంతో ఖర్చు చేసి ఫోన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వారికి కావాల్సిన వస్తువులను అందించినందుకు అభినందించారు. ఎన్నికలు, కరోనా, ధరణి సర్వే అయినా ముందున్న అంగన్వాడీ టీచర్లందరికీ ధన్యవాదులు తెలిపారు. రాబోయే రోజుల్లో వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి నరేశ్, ఎంపీపీ నక్క శంకరయ్య, జడ్పీటీసీ జలంధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లింగారెడ్డి, వైస్ ఎంపీపీ సత్యం, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీశ్ తదితరులు పాల్గొన్నారు.