Minister Dayakar Rao | వల్మిడీ సీతారామచంద్రస్వామి ఆలయానికి సోమవారం ప్రారంభోత్సవం చేయనున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. వల్మిడీ వాల్మీకి నడియాడిన నేల అని, ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మించుకొని ప్రారంభించుకుంటున్నామన్నారు. పాలకుర్తి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి.. ప్రజాప్రతినిధులకు కార్యక్రమం ఏర్పాట్లపై బాధ్యతలను అప్పగించారు. అలాగే కొడకండ్ల, దేవరుప్పుల, తొర్రూరు, రాయపర్తి, పెద్ద వంగర మండలాల నాయకులతో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, రేపు వాల్మీడిలో జరుగబోయే ఉత్సవాలను విజయవంతం చేయడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కార్యకర్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ రామాయణాన్ని రాసిన వాల్మీకి వల్మీడికి చెందిన వారని చరిత్ర చెబుతున్నదన్నారు. రాములోరి గుడి మీద రాముడు, సీత ఉండేవారని, పక్కనే మహాకవి పాల్కురికి సోమనాథుడు, సహజకవి బమ్మెర పోతనల జన్మస్థానాలున్నాయన్నారు.
పురాతన సాహిత్య చరిత్ర ఉన్న ప్రాంతం ఈ భూమి మీద మరోటి లేదని, ఇంత గొప్ప చారిత్రాత్మక ప్రాంతానికి మనమంతా వారసులమన్నారు. వల్మీడి రాములోరి గుట్ట మీద స్వయంభుగా వెలసిన సీతారామచంద్ర స్వామిదేవాలయాన్ని పునః ప్రారంభిస్తున్నామన్నారు. ఆలయంలోని విగ్రహాల పునఃప్రతిష్టాపన కార్యక్రమాలు ఒకటో తేదీన మొదలయ్యాయని, త్రిదండి చిన జీయర్ స్వామి చేతుల మీదుగా వల్మీడి సీతారామచంద్ర స్వాముల వారి విగ్రహాల పునః ప్రతిష్టాపన జరగనుండగా.. మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుకానున్నారు. ఉత్సవాలకు ప్రజలంతా కుటుంబ సమేతంగా హాజరుకావాలని కోరారు. ఇక్కడ ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని, వల్మీడీలో తలంబ్రాలు పడిన తర్వాతనే భద్రాచలంలో తలంబ్రాలు పడతాయని ప్రతీతన్నారు. ఇంత గొప్ప దేవాలయాన్ని పునరుద్ధరించి పూర్వవైభవం తేవాలని సంకల్పించామని, సీఎం కేసీఆర్ అండగా నిలిచారన్నారు. అడిగిన వెంటనే నిధులు ఇచ్చి ప్రోత్సహించారని, రూ.5కోట్లతో సీతారామచంద్రస్వామి దేవాలయ పునః నిర్మాణం జరిగిందని మంత్రి తెలిపారు.