జనగామ : పాలకుర్తి నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం వల్మీడి పాలకుర్తి, బమ్మెర దేవాలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. పాలకుర్తి ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు. అనంతరం సోమనాథ విగ్రహ ఏర్పాటు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.38.50 కోట్లతో వల్మీడి, పాలకుర్తి, బమ్మెర ఆధ్యాత్మిక కారిడార్ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. రూ.150కోట్లతో పాలకుర్తి నుంచి అన్ని ప్రాంతాలకు డబుల్ రోడ్లు వేస్తున్నానన్నారు.
వల్మీడి, పాలకుర్తి, బమ్మెర దేవాలయాల్లో అన్ని హంగులతో కాటేజీలు, కల్యాణ మండపాలు, మెట్లదారులు నిర్మించబోతున్నామన్నారు. త్వరలోనే పాలకుర్తిలో రిజర్వాయర్ సమీపంలో టూరిజం అతిథి గృహం నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. పాలకుర్తి దేవాలయానికి రూ.16.50 కోట్లు, వల్మీడికి రూ.6కోట్లు, బమ్మెరకు రూ.16 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. త్వరలోనే పాలకుర్తి చెరువును రిజర్వాయర్గా మార్చి.. దాని ఒడ్డున టూరిజం అతిథి గృహాన్ని నిర్మిస్తామన్నారు. త్వరలోనే సోమనాథ విగ్రహ ప్రతిష్టాపన చేపడుతామన్నారు.
సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, డివైడర్లు, పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు పెంచి, పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక, ప్రముఖ, చారిత్రక ప్రాంతంగా అభివృద్ధి పరుస్తానన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలుపై మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పాలకుర్తిలోనే డబుల్ ఇండ్లు నిర్మించామని, వాటిని తర్వలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. అలాగే మిగతా అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, కలెక్టర్ శివ లింగయ్య, ఆర్డీవో కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.