హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ కలెక్టరేట్ బుధవారం రైస్మిల్లర్లు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాసంగి సీజన్లో రైతుల నుంచి ధాన్యం సేకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత కష్ట, క్లిష్ట సమయంలోనూ సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. రూ.3వేల కోట్ల నష్టాన్ని సైతం లెక్కచేయకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.
కేంద్రం సహకరించకున్నా.. గతంలో వడ్లను కొనుగోలు చేసేది లేదని చెప్పినప్పటికీ.. కేవలం రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతోనే రైతు పక్షపాతిగా సీఎం మరోసారి ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రజలు, ప్రత్యేకించి రైతులు ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు, అధికారులు, మిల్లర్లు, హమాలీలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. సమన్వయం, పరస్పర సహకారంతో పని చేయాలని, రూ.1960 మద్దతు ధరతో గ్రామంలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తామన్నారు. ప్రతి రైతుకు టోకెన్లు ఇచ్చి.. క్రమపద్ధతిలో కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధం చేసుకోవాలని, ప్రణాళికతో కొనుగోలు చేయాలన్నారు.
గోదాములు అందుబాటులో లేకపోతే ప్రభుత్వ భవనాలను తాత్కాలికంగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో 1.68లక్షల ఎకరాల్లో పంట దిగుబడి వస్తుందని అంచనా ఉందని, ధాన్యం సేకరణకు 185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, స్టేషన్ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్లు భాస్కర్ రావు, హమీద్, రైతు బంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణా రెడ్డి, జనగామ మార్కెట్ చైర్ పర్సన్ బాల్దే విజయ, డీసీపీ సీతారాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.