హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైల పాత్ర విస్మరించలేనిదని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం టీడీఎఫ్- యూఎస్ఏ 6వ ప్రవాసి తెలంగాణ దివస్ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హాజరయ్యారు. విశేష అతిథిగా కేంద్రమంత్రి కిరణ్రెడ్డి, ముఖ్య అతిథిగా రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూర దేశాల్లో ఉన్నప్పటికీ సొంత ఊర్లను మరచిపోని తెలంగాణ బిడ్డలని మంత్రి చెప్పారు. ఉద్యమ సమయంలో టీడీఎఫ్ని ఏర్పాటు చేసి, కీలకంగా పని చేశారని కొనియాడారు. మరికొందరు ఉద్యమంలో భాగస్వాములయ్యారన్నారు. అలాంటి బిడ్డలకు సీఎం కేసీఆర్ అనేక అవకాశాలు కల్పించారని మంత్రి తెలిపారు.
అమెరికాలో టీడీఎఫ్ స్థాపించడం గొప్ప ప్రయత్నం
తెలంగాణ సమస్యలను చర్చించడానికి అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంను స్థాపించడం గొప్ప ప్రయత్నం అన్నారు. టీడీఎఫ్ తెలంగాణ గతం, వర్తమానం, భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నదన్నారు. ఇక్కడ తెలంగాణలో జాతీయ స్థాయి లీడర్ షిప్ కాన్ఫరెన్స్ నిర్వహించడం సంతోషం ఉంటూ నిర్వాహకులను అభినందించారు. టీడీఎఫ్ 2008 నుంచి తెలంగాణలో ప్రవాసీ తెలంగాణ నిర్వహిస్తోందని, రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ఎన్నారైల అభిప్రాయాలను తెలియజేస్తూ శ్రీకృష్ణ కమిటీకి నివేదికను సమర్పించిన గొప్ప చరిత్ర మీది అంటూ ప్రశంసించారు. కరోనా సమయంలో తెలంగాణలో వైద్య సహాయక చర్యలను అందించారని, రాష్ట్రంలో ఆశ వర్కర్లకు కరోనా రిలీఫ్ కిట్లతో పాటు 50 కంటే ఎక్కువ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందించడానికి విస్తృత చర్యలు తీసుకున్నారన్నారు.
సేవలు అభినందనీయం
గ్రామీణ తెలంగాణ రైతాంగానికి సుస్థిర వ్యవసాయం, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలపై అవగాహన కల్పించారని, మోడల్ వ్యవసాయ ప్రాజెక్ట్, పరిశోధనలు కోసం అదే పనిగా పనిచేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. మన తెలంగాణ సైన్స్ ల్యాబ్లు, స్మార్ట్ క్లాసు రూములు, ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు అందించడం ద్వారా గ్రామీణ పాఠశాలల్లో బోధన నాణ్యతను మెరుగుపరచడానికి ఎన్నారైలు చేస్తున్న కృషి అనన్య సామాన్యమన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పాఠశాలల్లో విజయవంతంగా అమలు చేసిన ఈ ప్రాజెక్ట్ను తెలంగాణ రాష్ట్రం అంతతా విస్తరించి అమలు చేయాలని ఆశిస్తున్నాను. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ను ఇవ్వడం ద్వారా వారిలో ఆత్మస్థయిర్యం పెంపొందుతుందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు, పిల్లల ఆకలి నివారణ, అనాథలకు సహాయం చేయడం హర్షించదగ్గ విషయమని, అందరినీ పేరుపేరున అభినందిస్తున్నానన్నారు.
చరిత్రలో నిలిచేలా సీఎం కేసీఆర్ పథకాలు
సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయే పథకాలను రూపొందించారని, రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్లు, దళిత బంధు, ఇలా చెప్పుకుంటూపోతే లెక్కనేనన్ని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపు మన రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నదన్నారు. అభివృద్ధికి మీ తోడ్పాటు అవసరమని, తెలంగాణ బిడ్డలుగా మీ సొంత ఊర్లను దత్తత తీసుకోవాలని సూచించారు. విద్య, వైద్యరంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడాలన్నారు. మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి కన్న తల్లి, సొంత ఊరి రుణం తీర్చుకోవాలంటూ ఎన్నారైలకు మంత్రి దయాకర్రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సభా అధ్యక్షులు కవిత చల్ల, టీడీఎఫ్-యూఎస్ఏ అధ్యక్షురాలు ప్రీతి చల్లా, వైస్ ప్రెసిడెంట్ రాజారెడ్డి, టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్, ప్రతినిధులు, పలువురు ప్రవాస భారతీయులు, ప్రముఖులు పాల్గొన్నారు.