హైదరాబాద్ : పంజాబ్లో మాదిరిగానే తెలంగాణలోనూ కేంద్ర ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం మంత్రుల నివాసంలో క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఉమ్మడి వరంగల్ జడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కోసం ప్రత్యేకంగా నిరసన, ఉద్యమ ప్రణాళికను రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తుంటే.. రైతుల పంటల పెట్టుబడిగా రైతుబంధు, దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబీమా, సాగునీరు, 24 గంటలు కోతలు లేని కరెంటు, రుణమాఫీ, రైతు కల్లాలు, రైతు వేదికలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని మండిపడ్డారు. దేశాన్ని ఆకలి రాజ్యం చేసే విధంగా కేంద్ర విధానాలున్నాయని ధ్వజమెత్తారు. అన్నంపెట్టే రైతుకు సున్నం పెట్టే విధంగా కేంద్రం వైఖరి ఉందని విమర్శించారు. కేంద్రం విధానాలను ఖండిస్తూ.. నిరసిస్తూ నిరసన తెలుపాలని.. రైతాంగాన్ని కూడగట్టి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు శాంతియుతంగా నిరసన ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆందోళనలో భాగంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు 24న సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని.. పార్టీ శ్రేణులు, నాయకులకు తగిన విధంగా దిశానిర్దేశం చేస్తారన్నారు. 26, 27, 30 తేదీల్లో గ్రామ, మండల, జిల్లా పరిషత్లు కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు, వైఖరికి నిరసనగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు.
సీఎం పిలుపు మేరకు ఈ నెల 24, 25 తేదీల్లో రైతులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 28న యాదాద్రికి పార్టీ శ్రేణులంతా తరలిరావాలన్నారు. సమావేశంలో వరంగల్, జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు సుధీర్ కుమార్, పాగాల సంపత్ రెడ్డి, కుసుమ జగదీశ్, గండ్ర జ్యోతి, వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, డోర్నకల్ పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, మాజీ చైర్మన్ కిషన్ రావు, కృష్ణారెడ్డి, నూకల నరేశ్ రెడ్డి, కేశవ్, సతీశ్ రెడ్డి పాల్గొన్నారు.