Minister Dayakar Rao | తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య సీఎం కేసీఆర్ తెలంగాణగా మారుస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ ఎంజీఎం దవాఖానాలో ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ను మండలి డెప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్ ప్రావీణ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వలపదాసు చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు. మంత్రి హరీశ్రావు వైద్యసేవలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నారన్నారు.
వరంగల్ను మెడికల్ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రూ.10.60కోట్ల విలువైన ఎంఆర్ఐ మిషన్ను ఎంజీఎంలో ప్రారంభించామని, ఇది దేశంలోనే అత్యాధునిక మిషన్ను ప్రారంభించుకుంటున్నామన్నారు. ఆసుపత్రిలో 2022 జూన్లో గుండె శస్త్రచికిత్స ఆపరేషన్లు ప్రారంభించామని, ఇప్పటి వరకు 1,949 యాంజియోగ్రామ్, 434 స్టంట్స్ వేశామని, 68 ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగాయన్నారు. వాటి విలువ రూ.22కోట్లు అన్నారు. కాక్ లియర్ ఆపరేషన్ చెవి వినికిడి ఇంప్లాటేషన్ మూడేళ్లలోపు బాలలకు చేయడం జరిగిందన్నారు. వాటి విలువ రూ.20లక్షలని, రూ.1.20కోట్ల విలువైన మైక్రో స్కోప్, డేరా మిషన్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు.
కరోనా సమయంలో 50వేల మంది ఇన్ పేషెంట్గా, 1.20 లక్షల మంది అవుట్ పేషెంట్లకు చికిత్స అందించినట్లు చెప్పారు. 150 మందికి బ్లాక్ ఫంగస్ ఆపరేషన్లు చేశామని, వీటికి అవసరమైన మిషన్లు రూ.50 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రూ.40 లక్షల లేజర్ మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. చిన్న పిల్లలకు వచ్చే టైప్- 1 డయాబెటిస్ పరీక్షలకు వేరుగా రూ.20 లక్షల వ్యయంతో మిషన్ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. రూ.1100కోట్లతో 24 అంతస్తుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు.