హైదరాబాద్ : ప్రభుత్వమే పండుగలు నిర్వహించే గొప్ప సంస్కృతి తెలంగాణకే సొంతమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో రంజాన్ సందర్భంగా ముస్లింలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ ముస్లింలు కలిసిమెలసి జీవిస్తున్నారని, కొన్ని మతోన్మాద శక్తులు ఇరువర్గాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఏటా అన్ని మతాల పండుగలను ప్రభుత్వమే నిర్వహించే గొప్ప సంస్కృతికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు.
బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలను నిర్వహిస్తుందన్నారు. ఈ సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదని, ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రభుత్వం ముస్లింల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం రంజాన్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ.. ఏటా రాష్ట్రంలోని దాదాపు నాలుగున్నర లక్షల మంది ముస్లింలకు దుస్తులను, రంజాన్ కానుకలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పేదింటి ముస్లిం యువత పెళ్లిళ్ల కోసం రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని షాదీ ముబారక్ కింద అందజేస్తుందన్నారు.
హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి రూ.40కోట్లు మంజూరు చేశారన్నారు. రాష్ట్రంలోని మసీదుల్లో సేవలందించే 10వేల మంది ఇమామ్లకు ప్రతినెలా రూ.5వేల భృతి అందిస్తుందన్నారు. తెలంగాణ వర్ఫ్ బోర్డు సంస్థలో నిర్మాణాలు, మరమ్మతుల కోసం నిధులు కేటాయించిందని, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేయడంతో పాటు నిర్వహణకు రూ.40కోట్లు కేటాయించింది.