హనుమకొండ : కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. బీజేపీ నేతలు ఎన్ని ఆటంకాలు కల్పించినా.. నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు యజ్ఞంలా కొనసాగుతూనే ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ జిల్లా కేశవపూర్లో రైతు వేదికను మంత్రి సత్యవతి రాథోడ్ కలిసి ప్రారంభించారు. దండేపల్లిలో ఆయిల్ ఫామ్సాగుకు అవసరమైన మొక్కలను పంపిణీ చేశారు. అలాగే కోతుల నడుమ గ్రామంలో రైతు వేదికను ప్రారంభించారు. భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ లో పంచాయతీరాజ్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అట్లాగే రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం ఎల్కతుర్తి మండలం దామెరలో 133/11 కేవీ సబ్ స్టేషన్ను ప్రారంభించారు.
ఆయా సందర్భాల్లో వేర్వేరుగా జరిగిన సభల్లో మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ అనతి కాలంలోనే దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించిందన్నారు. రైతుల కోసం కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు, 24 గంటల పాటు ఉచితంగా న్యాయమైన కోతలు లేని కరెంటు ఇస్తున్నామన్నారు. విత్తనాలు, రుణమాఫీ, రైతుబీమా అమలు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ పథకాలతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని, ప్రధాని మోదీ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. వీటిని ప్రజలు గమనించాలన్నారు. రైతులను లాభదాయక వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అందుకే ఆయిల్ పామ్ పంటలను బాగా వేయాలని, ఇందుకు సబ్సిడీని ఇస్తూ, డ్రిప్ ఇరిగేషన్ను కూడా అందచేస్తున్నామని మంత్రి వివరించారు.
గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, గాంధీజీ మాటలను నిజం చేస్తూ పల్లె ప్రగతి వంటి పథకాలను అమలు చేస్తూ.. సీఎం కేసీఆర్ పల్లెలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేశంలో 20 అత్యున్నత గ్రామాలను ఎంపిక చేస్తే, అందులో 19 గ్రామాలు తెలంగాణవే ఉన్నాయన్నారు. ఇవాళ తెలంగాణ పల్లెలు దేశానికి పట్టుగొమ్మల్లా నిలిచాయని మంత్రి తెలిపారు. గ్రామాల్లో ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, సీసీరోడ్లు, మౌలిక వసతులు, పచ్చదనం, పరిశుభ్రత, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతివనాలు, బృహత్ పల్లె ప్రకృతివనాలు, క్రీడా ప్రాంగణాలు.. ఇలా ఇన్ని పథకాలు ఎక్కడా లేవన్నారు. కార్యక్రమాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్, జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ కులపతి ప్రవీణ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, రైతులు, పాల్గొన్నారు.