హైదరాబాద్ : తెలంగాణ సాయుధ అమరువీరులను తెలంగాణ బీజేపీ అవమానించిందని, ఈ రాష్ట్ర స్ఫూర్తి ప్రదాతల పట్ల కనీస గౌరవం లేదంటూ మంత్రి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు.
తెలంగాణ పోరాట యోధులు, స్ఫూర్తి ప్రదాతలను ప్రజలు స్మరించుకుంటూ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించుకుంటుంటే.. బీజేపీ చిట్యాల ఐలమ్మను చిన్న కులంలో పుట్టిన చిట్టెలుక అనడం, సాయుధ పోరాటంలో మొదట ప్రాణార్పన చేసిన దొడ్డి కొమురయ్యను ఒక బీసీ చిన్న కులంలో పుట్టాడని వ్యాఖ్యానించడం.. వారిని అవమానించడమేనన్నారు. ప్రజలన్నా, ప్రజలు ఆరాధించే స్ఫూర్తి ప్రదాతలన్నా బీజేపీకి గౌరవం లేదని, అడ్డదొడ్డి దారిలో రాజకీయ అధికారం కోసం తప్ప మరే ప్రేమ లేదని ఆరోపించారు.
హైదరాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి, టూరిజం మంత్రి కిషన్రెడ్డిలతో బీజేపీ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సభ జనం లేక వెలవెల బోయిందని, అలాగే నాడు సమైక్యత కోసం జాతీయ నాయకులు పని చేస్తే, నేడు బీజేపీ విచ్ఛిన్నం పని చేస్తుందని మంత్రి ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాటంతో, స్వాతంత్య్ర ఉద్యమంతో కనీస సంబంధం లేని పార్టీ పెట్టే సమావేశాలను, పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. ఇదే విషయం మరోసారి రుజువైందన్నారు. తెలంగాణ ప్రజలపై కపట ప్రేమను ఒలకబోసే బీజేపీ.. మరి తెలంగాణకు ఎలాంటి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు.