హైదరాబాద్ : బతుకమ్మ చీరెలతో పంపిణీ ద్వారా మహిళలకు కానుక అందించడంతోపాటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు మండల కేంద్రంలో శనివారం బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలందరికీ దసరా పండుగ కానుకగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందన్నారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బతుకమ్మ పండుగను వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సమాజంలోని అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు.
తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆడ బిడ్డలకు చీరెలను అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి మహిళ సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, రాష్ట్రవ్యాప్తంగా 1.10కోట్ల మందికి కాను కలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇందుకు రూ.340కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వాలు ఏనాడూ మహిళల అభ్యున్నతిపై శ్రద్ధ వహించలేదని, కేసీఆర్ ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళలకు కానుక అందించడంతోపాటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. బతుకమ్మ చీరల తయారీతో జీవనోపాధి కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, డీఆర్ఓ సన్యాసయ్య, ఎంపీపీ అంజయ్య, మున్సిపల్ కమిషనర్ రామచంద్రయ్య,
జడ్పీటీసీ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ శాంత, ఆర్డీవో రమేశ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.