Balagam Movie | తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రీకరించిన ‘బలగం’ సినిమాను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వేంకటేశ్వరస్వామి థియేటర్లో ఆదివారం ప్రదర్శించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పలువురు అనాథ పిల్లలు, ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సినిమాను వీక్షించారు. సినిమా ప్రదర్శన సందర్భంగా దర్శకుడు యెల్దండి వేణు, నటుడు రచ్చ రవి, ఇతర యూనిట్ సభ్యులు థియేటర్ వద్ద సందడి చేశారు.
ఈ సందర్భంగా చిత్రబృందం మంత్రి ఎర్రబెల్లిని, ప్రేక్షకుల్ని కలిశారు. కొద్దిసేపు ప్రేక్షకులు అనాథ పిల్లలతో సమయం గడిపారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ బలగం సినిమా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించిందన్నారు. ప్రపంచంలో ప్రేమానురాగాలు, బంధాలు, అనుబంధాలను అద్భుతంగా చిత్రీకరించారని, బలగం సినిమా చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి పేర్కొన్నారు. ఇంత గొప్ప సినిమా తీసిన సినీ నటులంతా డైరెక్టర్తో సహా నటీనటులు మనతోనే ఉండడం అదృష్టమన్నారు.
పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు సినిమా రంగంలో రాణిస్తుండడం మంచి పరిణామన్నారు. అమ్మపురం నవీన్ కుమార్ గట్టు, పాలకుర్తికి చెందిన శశివర్మ సుంకరి ఇంకా అనేక మంది సినిమా రంగంలో సరికొత్త సినిమాలని తీస్తున్నారని రాణిస్తున్నారని మంత్రి అభినందించారు. సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి మాట్లాడుతూ సినిమా సక్సెస్ గురించి చెప్పాలింది ఏమీ లేదని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారం ఎన్నటికీ మరువలేనిది అన్నారు.
సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు సహకరించిన మంత్రికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. నటుడు రచ్చ రవి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించిన వాళ్లలో సినిమాకు పనిచేసిన వాళ్లలో ఎక్కువమంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారేమన్నారు. అలాగే సిరిసిల్ల నుంచి వచ్చిన వేణు వేణు అద్భుత ప్రతిభ కనబరిచారని, తన జీవితంలో మరిచిపోలేని గొప్ప అనుభూతిని మిగిల్చిన మంచి సినిమాను ఇచ్చారని చెప్పారు. అలాగే మంత్రి దయాకర్రావు చూపిన చొరవ, ఆదరణను ఎప్పటికీ మరువలేమన్నారు.