Vizag Steel | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: విశాఖ ఉక్కును కాపాడే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉన్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి చరిత్ర సృష్టించారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ తరహాలో పరిపాలించడం ఎవరి వల్లా కాదని.. అందుకే యావత్తు దేశం కేసీఆర్ వైపు చూస్తున్నదని చెప్పారు. పలు రాష్ర్టాల్లోని ప్రజలు తమకు కేసీఆర్ వంటి సీఎం కావాలని, కేసీఆర్ తరహా పాలన కావాలని అడుగుతున్నారని తెలిపారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారని, అక్కడ బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు మల్లారెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తానూ కార్మికుడినేనని.. కార్మికులకు ధైర్యం చెప్పేందుకు.. భరోసానిచ్చేందుకే ఖాకీ దుస్తులు వేసుకొని వచ్చానని చెప్పారు. ఏపీలో రెడ్డి, కమ్మ, కాపు అంటూ కుల రాజకీయాలు చేస్తున్నారని, కానీ ప్రజలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఏపీ ప్రజలను పట్టించుకునేది కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలని, ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే సందర్భంగా కార్మికులంతా శపథం చేయాలని కోరారు. 2024లో కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని పునరుద్ఘాటించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెందుతుందని, కార్మికులంతా కష్టపడి పెద్ద పెద్ద బిల్డర్లు, కాంట్రాక్టర్లు కావాలని ఆకాంక్షించారు. ఈఎస్ఐలో కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నా కేంద్రం కార్మికుల వైద్యం కోసం రూపాయి ఇవ్వడంలేదని విమర్శించారు.
ఏండ్లుగా దోపిడీకి గురవుతున్న కార్మికులకు విముక్తి కలిగించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు లేక వేల పరిశ్రమలు మూతబడి కార్మికులు రోడ్డునపడ్డ ఉదంతాలున్నాయని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తూ పరిశ్రమలను, కార్మికులను కాపాడుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను పట్టించుకోలేదని, వారిని క్రమబద్ధీకరించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని తెలిపారు. హైదరాబాద్కు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయని, దీంతో లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జలమండలి ఎండీ దానకిశోర్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాణి కుముదిని, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, కార్మికశాఖ అధికారి గంగాధర్, కార్మికులు పాల్గొన్నారు.
ఒకప్పుడు రాష్ట్రంలో బతుకుదెరువులేని పరిస్థితులుండేవని.. కానీ ఇప్పుడు దేశంలోని 15 రాష్ర్టాల కార్మికులకు హైదరాబాద్ బతుకుదెరువునిస్తున్నదని మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు రామచంద్రుల్లా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, కేటీఆర్ వల్లే హైదరాబాద్ కళకళలాడుతున్నదని కొనియాడారు. హైదరాబాద్ ముందు అమెరికా పాతగైంది.. బొంబాయి.. బెంగళూరు వెనుకబడిపోయాయి.. నేడు ఒకే ఒక్క హైదరాబాద్ కళకళలాడుతున్నది.. ఇదంతా కేటీఆర్ చలవేనని చెప్పారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో రూ.1,800 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ నిధులున్నాయని, ఈ నిధులను కార్మికుల సంక్షేమానికి వినియోగిస్తామని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికులకు మోటర్ సైకిళ్లు, కార్మికుల పిల్లలకు కేవీ స్కూళ్ల తరహాలో ప్రత్యేకంగా బడులు, దవాఖానలు, కార్మిక భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వీటిని గతంలోనే అమలుచేయాలని యోచన చేసినా, కరోనాతో ఆలస్యమయ్యిందని, సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో వీటన్నింటిని దశలవారీగా అమలుచేస్తామని పేర్కొన్నారు. 60 మందికి శ్రమశక్తి అవార్డులను ప్రదానంచేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సందేశాన్ని సభలో చదివి వినిపించారు.