Congress Govt | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా యూనిఫాంలు పంపిణీ చేస్తున్నది. వీటిని మహిళా సంఘాల సభ్యులు కుడుతుంటారు. వారికి ప్రభుత్వం యూనిఫాంకు రూ.50చొప్పున చెల్లిస్తున్నది. కానీ దానిపైనా కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ సాక్షిగా అబద్ధం చెప్పింది. తాము రూ.25 పెంచి రూ.75 ఇస్తున్నామని ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. కానీ ఇదంతా అబద్ధమని బీఆర్ఎస్ బయటపెట్టింది. కేవలం జీవో ఇచ్చి చేతులు దులుపుకొన్న సర్కారు అదనంగా చెల్లిస్తున్నామని చెప్పుకోవడమేంటని మహిళా నేతలు మండిపడుతున్నారు.
బడి పిల్లలకు యూనిఫాంలు కుట్టే తమకు కూలీ గిట్టుబాటు కావడం లేదని, పెంచాల్సిందేనని గతంలో మహిళా సంఘాల నేతలు సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కేంద్రం సమగ్ర శిశుయోజన కింద ఒక్కో జతకు రూ.50 చెల్లిస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కలిపి రూ.75 చొప్పున ఇస్తామని రేవంత్రెడ్డి చెప్పారు. ఈ మేరకు నిరుడు జూన్ 7న ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. జీవో రాగానే కూలీ పెరిగిందని మహిళా సంఘాల సభ్యులు భావించారు. రాష్ట్రంలోని 26,009 బడుల్లోని 18,58,841 మంది విద్యార్థులకు ఒక్కో జత చొప్పున కుట్టి అధికారులకు అందించారు. కానీ ప్రభుత్వం జతకు రూ.50 మాత్రమే చెల్లించింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు షాక్కు గురయ్యారు. సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు యూనిఫాంలు కుట్టిన మహిళలకు ఒక్కో జతకు రూ.75 చొప్పున చెల్లించలేదు. కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష యోజన కింద యూనిఫాం జతకు రూ.50 చొప్పున రూ.9,29,42,050 ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకారం మరో రూ.4,64,71,025 విడుదల చేయలేదు. మహిళ సంఘాల నేతలు మెప్మా, ఐకేపీ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. కానీ అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం రూ.75 చెల్లించామని ప్రభుత్వ పెద్దలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని మహిళలు ప్రశ్నిస్తున్నారు.