సోన్, జూన్ 12: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కోరారు. సోమవారం నిర్మల్లోని కడ్తాల్ వై జంక్షన్ సాగర్ కన్వెన్షన్ హాలు వద్ద దివ్యాంగుల కృతజ్ఞత సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులు సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
అనంతరం మంత్రి అల్లోల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కష్టాలు.. కన్నీళ్లు చూసే సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలుచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాకముందు దివ్యాంగుల పింఛన్ రూ.500 ఉండగా, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు రూ.4,016కు పెంచడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రభుత్వం దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, ల్యాప్టాప్లు అందిస్తున్నదని, దివ్యాంగులను పెండ్లి చేసుకుంటే నగదు ప్రోత్సాహం ఇస్తున్నదని చెప్పారు. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల్లో దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని తెలిపారు. అదే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దివ్యాంగుల పెన్షన్ రూ.600కు మించి లేదని మంత్రి పేర్కొన్నారు. త్వరలో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.