Minister Ajay Kumar | ఖమ్మం జిల్లా చీమలపాడు బాధిత కుటుంబాలకు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2లక్షల ఆర్థిక సాయంతో పాటు వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని తారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి సమీపంలో సిలిండర్ పేలడంతో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మరో వైపు ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్యకర్తలు మృతి చెందడం బాధాకరమన్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యమందించేలా చర్యలు చేపట్టాలని నేతలకు సూచించారు.