నిర్మల్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): బాసర ట్రిపుల్ ఐటీలో మినీ టీ-హబ్ను అతిత్వరలో ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తమవంతు పాత్ర పోషిస్తామని తెలిపారు. శనివారం నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ఆర్జీయూకేటీకి చేరుకున్న కేటీఆర్.. ట్రిపుల్ ఐటీపై గతంలో ఇచ్చిన హామీల అమలును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాన్ఫరెన్స్హాల్లో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 570మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ పట్టాలు అందజేయడంతోపాటు, గత మూడేండ్లలో ఆయా విభాగాల్లో వర్సిటీ టాపర్లుగా నిలిచిన 36 మంది విద్యార్థులకు మంత్రి కేటీఆర్ స్వర్ణపతకాలను ప్రదానం చేశారు. 2,200 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో టీ-హబ్ ప్రతినిధులతో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ్కుమార్ ఒప్పందం(ఎంవోయూ) చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థులను తీర్చిదిద్దడంలో బాసర ట్రిపుల్ ఐటీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తూనే.. కొత్తగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను క్యాంపస్లో చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన మేరకు రూ.5 కోట్లతో సైన్స్ బ్లాక్ను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. మిషన్ భగీరథ ద్వారా యూనివర్సిటీకి స్వచ్ఛమైన తాగునీటిని అందించేలా అధికారులను ఆదేశిస్తామని, యూనివర్సిటీ ఆవరణలోని చెరువును హెచ్ఎండీఏ సహకారంతో సుందరీకరిస్తామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా యూనివర్సిటీ మొత్తానికి సౌరవిద్యుత్తు అందేలా సోలార్పవర్ ప్లాంటును ఏర్పాటు చేస్తామని కేటీఆర్ విద్యార్థులకు హామీ ఇచ్చారు.
భవిష్యత్తు త్రీడీదే..
డిజిటలైజేషన్ తర్వాత టెక్నాలజీ వేగంగా విస్తరించిందని, అలాంటి విపణిలో తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు భాగమవడం అభినందనీయమని ప్రశంసించారు. ‘మారుతున్న సాంకేతికత నేపథ్యంలో ప్రపంచం త్రీ-డీ వైపు దృష్టిసారిస్తున్నది. రాబోయే రెండు దశాబ్దాలపాటు దానిదే రాజ్యం. త్రీ-డీ.. అంటే డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, డీసెంట్రలైజేషన్. భవిష్యత్తు అంతా వీటి చుట్టే తిరుగుతుంది’ అని కేటీఆర్ వివరించారు.
సమస్యల పరిష్కారంపై కేటీఆర్ సమీక్ష
ట్రిపుల్ ఐటీలోని కాన్ఫరెన్స్ హాల్లో ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్తోపాటు విద్యార్థిని, విద్యార్థులతో సమావేశమైన మంత్రి కేటీఆర్.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. రెండు నెలలక్రితం తాను ఇచ్చిన హామీలన్నింటినీ ఏమేరకు పూర్తిచేశారని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణను అడిగి తెలుసుకున్నారు. మెస్ సమస్య పరిష్కారంలో జాప్యంపై వీసీపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. మెస్ టెండర్లను వెంటనే పూర్తిచేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం మంత్రులు విద్యార్థులకు ల్యాప్టాప్లు, యూనిఫాం, షూస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు.
ఐటీలో తెలంగాణ టాప్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం విప్లవాత్మక ప్రగతిని సాధించిందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 20 వేలకు పైగా పరిశ్రమలు రాష్ర్టానికి వచ్చాయని, ఇప్పటికే అనేక ప్రముఖ ఐటీ కంపెనీలు తెలంగాణలో తమ ఉత్పత్తులను ప్రారంభించాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందుకోవడంలో ముందుండాలని, తద్వారా గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. తమలోని నైపుణ్యాన్ని పెంచుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో ఉన్నతవిద్య కొత్త పుంతలు తొక్కుతున్నదని చెప్పారు. ‘బాసర ట్రిపుల్ ఐటీపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడి సమస్యల పరిష్కారానికి రూ.25 కోట్లు అవసరమైతే.. రూ.27కోట్లు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. మేం గతంలో చెప్పిన విధంగానే బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు 2,200 ల్యాప్టాప్లను అందిస్తున్నాం. ట్రిపుల్ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాం. ఒక్క మెస్ సమస్య మాత్రమే మిగిలి ఉన్నది. త్వరలోనే దానిని కూడా పరిష్కరించి విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనాన్ని అందిస్తాం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.