సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ) :గ్రేటర్లో మరింత మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకుగాను.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నెల 1నుంచి చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగియనున్నది. పారిశుధ్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, హరితహారం పనులపై ప్రత్యేక దృష్టి సారించిన యంత్రాంగం వార్డుల వారీగా ప్రణాళికలతో నగరాన్ని మరింత పరిశుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడే విధంగా చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే పారిశుధ్యం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణను అధునిక పద్ధతిలో చేపడుతున్నది. వీధులు, కాలనీలు, పరిశుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్తను సేకరిస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు ఆరు వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సేకరిస్తుండగా.. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా 200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను అదనంగా సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సీజనల్ వ్యాధుల నివారణకై పారిశుధ్య కార్యక్రమాలు, నీటి నిల్వల తొలగింపు, దోమల నివారణకు మందుల స్ప్రే, చెత్త తొలగింపు, రహదారుల వెంట పిచ్చి మొక్కల తొలగింపు, రోడ్ల వెంట భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు, శిథిల భవనాల కూల్చివేత, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లకు స్థల సేకరణ తదితర కార్యక్రమాలను పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ ఒక్కటే మార్గమని పలు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.