తాడ్వాయి : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతరకు ముహుర్తం ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మినీ మేడారం జాతరను నిర్వహించనున్నారు. అమ్మవార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు పూజారులు మినీ జాతర తేదీలను నిర్వహించేందుకు ఇటీవల సమావేశమయ్యారు. అమ్మవార్లకు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1వ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర(మండమెలిగే పండుగ) నిర్వహిస్తారు.
ఈ మినీ జాతరలో వన దేవతలను గద్దెలపైకి తీసుకురావడం మినహా మిగిత పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. మేడారంలోని సమ్మక్క పూజా మందిరంలో కొక్కెర కృష్ణయ్య, కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరంలో కాక సారయ్యలు, అమ్మవార్ల పూజారులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మినీ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం నిధులను మంజూరు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రభుత్వాన్ని కోరారు.