మహబూబ్నగర్, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కృషి, పట్టుదలతోపాటు తపన ఉంటే జీవితంలో విజయం సాధించవచ్చని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్పో ప్లాజాలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, శాంతా నారాయణగౌడ్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పోటీపరీక్షల అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తెలివితేటలే మనకు గొప్ప ఆస్తి అని తెలిపారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటున్నదన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందే మంత్రితో పాటు అధికార యంత్రాంగంతో సమావేశమై పక్కా ప్రణాళిక రచించినట్టు జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. అభ్యర్థులు చివరివరకు కోచింగ్కు హాజరుకావడం వారి నిబద్ధతకు నిదర్శనమని ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సదస్సుకు ముఖ్య వక్తలుగా సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, మాజీ ఐఏఎస్ అధికారిణి మల్లవరపు బాలలత, వేపా అకాడమీ డైరెక్టర్ డా.సీఎస్ వేపా ఉపన్యాసాలు ఆకట్టుకొన్నాయి. సదస్సుల నిర్వహణతో తమకు మనోధైర్యాన్ని కల్పించిన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు.