హైదరాబాద్: తెలంగాణ ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సీఎం కేసీఆర్ మళ్లీ హ్యాట్రిక్ సీఎంగా పదవిని అధిరోహిస్తారని, మళ్లీ తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ వేదికగా చెప్పారు. దేశం మొత్తం అల్లకల్లోలమవుతున్న వేళ తెలంగాణలో ముస్లింలంతా చాలా భద్రంగా ఉన్నారని, తెలంగాణలో పుట్టిన ముస్లింలుగా తాము గర్విస్తున్నామని గుండెమీద చేయివేసుకొని చెప్పారు. ‘తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి’పై అసెంబ్లీలో లఘు చర్చ ప్రారంభం సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. దేశంలోని అత్యధికంగా ముస్లింలు ఉన్న రాష్ర్టాల్లోనూ రూ.700 కోట్లకు మించి నిధులు కేటాయించడం లేదని.. కేవలం 50 లక్షలు మంది ముస్లిం జనాభా ఉన్న ఒక్క తెలంగాణలో రూ.2,200 కోట్లకుపైగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇదీ మైనార్టీలకు తెలంగాణ ఇచ్చిన గౌరవమని, సీఎం కేసీఆర్ను చూసి ఇతర రాష్ర్టాలు నేర్చుకోవాలని హితవు పలికారు. కేవలం 9 ఏండ్లలో తెలంగాణను దేశానికి దిక్సూచిగా మార్చారని అక్బరుద్దీన్ కొనియాడారు.
దేశమంతా మత ఘర్షణలతో దారుణంగా ఉందని, ముస్లిం జనాభాపై తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయని అక్బరుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్, మణిపూర్, యూపీ, మధ్యప్రదేశ్లలో రణరంగంగా మారుతోందని, కానీ తెలంగాణలో గత తొమ్మిదేండ్లలో ఒక్కటకంటే ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదని అదీ సమర్థవంతమైన పాలనకు నిదర్శనమని అక్బరుద్దీన్ కొనియాడారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో బుల్డోజర్ పాలన నడుస్తుంటే.. తెలంగాణలో అన్ని వర్గాల పేదలకు డబుల్ బెడ్రూమ్ పాలన నడుస్తుందన్నారు. ఒక్క తెలంగాణలో మాత్రమే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్దులు సంతోషంగా బతుకుతున్నారని కొనియాడారు. తెలంగాణ మత సార్వభౌమత్వం కలిగిన రాష్ట్రమని, భిన్నత్వంలో ఏకత్వం తెలంగాణ పాలనకు నిదర్శనమని, గంగాజమున తెహజీబ్గా తెలంగాణ కీర్తించబడుతున్నదని.. నిండు సభ సాక్షిగా గుండెమీద చేయివేసుకొని తెలంగాణ ముస్లింగా తాను గర్విస్తున్నానని భావోద్వేగంగా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. హిందువుగా తికలం దిద్దుకున్నా.. ముస్లింగా టోపీ పెట్టుకున్నా.. ఏ మతమైనా తెలంగాణలో అంతా ఒక్కటేనని, అందరూ సమానమనే భావనను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
బంగారు తెలంగాణ సాధన దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నదని, ఇక్కడ కోకాపేటలోని ఎకరం రూ.వంద కోట్లు పలకడమే రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. అద్భుతమైన రీతిలో కాళేశ్వరం నిర్మించి రైతులకు సాగునీరు అందిస్తున్నారని కొనియాడారు. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల వారికి ఆసరా పింఛన్లు ఇవ్వడం, దివ్యాంగులకు 4వేలు పింఛను పెంచడం గొప్ప విషయమన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు లక్షలాది మంది యువతుల కుటుంబాలకు అండగా నిలిచాయన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్స్, కంటి వెలుగు, బస్తీ దావఖానాలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, వంటి ప్రభుత్వ కార్యక్రమాలు తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా నిలిచాయన్నారు. ఐటీ, ఐటీ సంబంధిత రంగాల్లో డబుల్ డిజిట్ గ్రోత్ ఆవిష్కృతమైందన్నారు. అలాగే ఏ రాష్ట్రంలోను లేనంతగా 9 ఏండ్లలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,12,198 పెరిగిందని, సమర్థవంతమైన పాలనకు ఇవన్నీ మచ్చుతునకలని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటుతో పాలన సజావుగా సాగుతుందని, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని, 10 లక్షలకు పైగా సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతకు పెద్దపీట వేశారని అక్బరుద్దీన్ కొనియాడారు.
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలతో సమానంగా తెలంగాణలోని మైనార్టీలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అక్బరుద్దీన్ ఓవైసీ కొనియాడారు. రైల్లే పోలీసుల కాల్పుల్లో చనిపోయిన సైఫుద్దీన్ కుటుంబానికి సీఎం కేసీఆర్ ఆర్థికసాయంచేసి, ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అండగా నిలిచారని, తమ వినతి మేరకు ప్రభుత్వం సత్వరం స్పందించడం సంతోషంగా ఉందని సభ సాక్షిగా కృతజ్ఞతలు తెలిపారు. షాదీముబారక్ పథకం ద్వారా 2 లక్షల మంది ముస్లిం యువతులు లబ్ధి పొందారని తెలిపారు. అలాగే ఓవర్సీస్ పథకం ద్వారా దాదాపు 3వేల మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నారని, తమ వినతిని మన్నించి ముస్లిం విద్యార్థులకు సైతం ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారని తద్వారా 700 మంది 9 ఏండ్లలో లబ్ధిపొందారని చెప్పారు. హజ్ హౌస్ కోసం రూ. 23 కోట్లు కేటాయించడం, స్థలం ఇవ్వడం, 57,58 జీఓల ద్వారా పట్టాలిచ్చి ముస్లింలను ఆదుకున్నారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో శిథిలమైన మక్కా మసీద్ను కొత్తగా రూపొందిస్తున్నారని, పనులు వేగవంతం చేశారని అక్బరుద్దీన్ కొనియాడారు. క్రిస్మస్, రంజాన్లకు తోఫాలు ఇస్తున్నారని చెప్పారు. బీసీలకు ఇచ్చినట్లే, ముస్లిం మైనార్టీలకు కూడా లక్ష రూపాయల ఆర్థికసాయం చేయడం గొప్ప విషయమన్నారు. గురుకుల, స్టాఫ్ నర్స్, పాలిటెక్నిక్ అధ్యాపకుల పోటీ పరీక్షలు ఉండటం వల్ల గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. దేవుళ్లందరీ దీవెనలు ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉండాలని, మళ్లీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా గెలువాలని ఆయన ఆకాక్షించారు.