MP Asaduddin | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రికి ఉండాల్సిన అన్ని లక్షణాలు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావులో ఉన్నాయని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన సామర్థ్యం, రాజకీయ చతురత, దూరదృష్టి అమోఘమని కొనియాడారు. మమతాబెనర్జీ, రాహుల్గాంధీని ప్రధాని అభ్యర్థులుగా చూపుతున్నారని, కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ను తక్కువ అంచనా వేయొద్దని తేల్చిచెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి ఇండియా కూటమి ప్రత్యామ్నాయం కాదని, మూడో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని స్పష్టం చేశారు.
ఇండియా కూటమిలో మాయావతి, కేసీఆర్తో పాటు అస్సాంలోని పలు పార్టీలు చేరలేదని వెల్లడించారు. మణిపూర్లో చర్చిలు, హర్యానాలో మసీదులను ధ్వంసం చేస్తుండగా.. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ సచివాలయంలో చర్చి, దేవాలయం, మసీదులను పునర్నిర్మించి, ప్రారంభించారని శ్లాఘించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలకు భిన్నంగా తెలంగాణ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదని అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రభుత్వం మసీదులను కూల్చి తిరిగి నిర్మించిందో చూపండి? అని ప్రశ్నించిన అసద్.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే నూతన సచివాలయంలో మసీదును పునర్నిర్మించారని చెప్పారు. గతంలో బాబ్రీమసీదును పునర్నిర్మిస్తామని కాంగ్రెస్ సీడబ్ల్యూసీలో నిర్ణయించిందని, కానీ ఆ పార్టీ ఆ విషయాన్నే మరిచిపోయిందని మండిపడ్డారు.
తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు గణనీయంగా తగ్గాయని అసుదుద్దీన్ తెలిపారు. ప్రతి ఇంటికీ మంచినీళ్లు అందుతున్నాయని, రైతులకు సాగునీరు, కరెంటు అందుబాటులో ఉండటంతో రైతులంతా సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. రైతాంగానికి ఉచిత కరెంటు కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.50 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చిందని ప్రశంసించారు. దేశానికి ఇలాంటి దూరదృష్టి, రైతు ప్రయోజనాలే అవసరం అని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కచ్చితంగా ప్రశంసిస్తామని, ఎన్నికల్లో తమ అభ్యర్థులు నిల్చున్న చోట బీఆర్ఎస్తో పోరాడతామని వెల్లడించారు. షాదీ ముబారక్, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు వేల మంది ముస్లిం విద్యార్థులకు ఉచితంగా విద్య అందుతున్నదని తెలిపారు. తన నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మైనార్టీ విద్యార్థులు నీట్లో మంచి ర్యాంక్ సాధించి, ఎంబీబీఎస్లో ప్రభుత్వ సీటు సాధించారని గుర్తుచేశారు.