హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ ఒక అపూర్వ ఘట్టమని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో మిలియన్ మార్చ్ను నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘట్టమైన మిలియన్ మార్చ్ రోజును స్మరిస్తూ గన్పార్క్ను శ్రీనివాస్గౌడ్ సందర్శించారు. అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం తెలంగాణభవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు నిర్భంధాలు, ఆంక్షలను లెక్క చేయకుండా, 15 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదేరోజు లక్షల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఐక్యతాభావం చాటారని గుర్తుచేశారు. ‘మిలియన్ మార్చ్ డే’ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు బీఆర్ఎస్ తరఫున నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఎంతగానో దోహదపడిన మిలియన్ మార్చ్లో తాను సైతం పాల్గొనడం గర్వంగా ఉన్నదని చెప్పారు.
సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ పాలనలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని, ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదాన్ని కేసీఆర్ హయాంలో సాకారం చేసుకున్నామని పేర్కొన్నారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు, నిరుద్యోగులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, పరాయి పాలన ఆనవాళ్లు మళ్లీ మొలుస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు లేవు, రైతుబంధు లేదు, కృష్ణా నీళ్లను సరిగా వాడుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టులకు కాలువలు తవ్వక పోవడం వల్ల ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేక పోతున్నదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఒక అధికారికి తెలంగాణ సాగునీటి శాఖలో కీలక బాధ్యతలు అప్పజెప్పి, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అయోమయం నెలకొన్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వైఫల్యాలపై తెలంగాణ ఉద్యమం తరహాలో మరో మిలియన్ మార్చ్ చేపట్టాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. నాటి మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ఈ అసమర్థ ప్రభుత్వంపై పోరాడి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.