హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాల సాగును రాష్ట్రంలో విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్టు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. అసోచామ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని నోవాటెల్లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. మా రుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ద్వా రా ప్రాసెస్డ్ ఆహారాన్ని అందించాలని సూచించారు. పల్లీలు, చిరుధాన్యాలతో చికీల లాంటి పదార్థాలను తయారుచేసి విద్యార్థులకు అం దించగలిగితే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందని చెప్పారు. తెలంగాణ లాంటి సమశీతోష్ణ ప్రాంతాలు చిరుధాన్యాల ఉత్పత్తికి ఎంతో అనుకూలమని, ప్రతిష్ఠాత్మకమైన ఇక్రిశాట్ సంస్థ తెలంగాణలో ఏర్పడటానికి ఇదే కారణమని పేర్కొన్నారు.
వాళ్లకు కల్పించిన భరోసా రైతుకు ఏది?
దేశ సంపదను అంబానీ, అదానీ లాంటి బడా వ్యాపారులకు అప్పనంగా దోచిపెడుతున్న నరేంద్రమోదీ సర్కారు రైతులకు ఎందుకు అండగా నిలవదని మంత్రి నిరంజన్రెడ్డి నిలదీశారు. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న నష్టాలకు మార్కెటింగ్ సమస్యలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. సాట్లాండ్ లాంటి చిన్న దేశాలు తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకుంటున్నాయని, 140 కోట్ల మందిని ఏలుతున్న కేంద్ర పాలకులు ఆ రకమైన ఆలోచన ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. తెలంగాణలో పండిస్తున్న వేరుశనగ, పప్పు ధాన్యాలకు చిరుధాన్యల మాదిరిగా మార్కెటింగ్ సదుపాయాలను పెంచేందుకు అసోచామ్ ప్రయత్నించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జయేశ్ రంజన్, ఎస్బీఐ సీజీఎం అమిత్ జింగ్రాన్, అసోచామ్ తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ కటారు రవికుమార్రెడ్డి, న్యూట్రిహబ్ సీఈవో డాక్టర్ దయాకర్రావు, ఐపీపీ సీఈవో డాక్టర్ రంగయ్య, అసోచామ్ అడిషనల్ డైరెక్టర్ మచ్చ దినేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.