హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): చిరుధాన్యాలతో రకరకాల వంటలు చేసుకోవటం కామన్. కానీ, కూల్డ్రింక్ లాంటి పానీయాన్ని తయారుచేస్తే! అది సాధ్యమేనా? అనిపిస్తుంది. దాన్ని సుసాధ్యం చేసి నిరూపించిందో హైదరాబాదీ స్టార్టప్. తెలంగాణ సర్కారు, టీహబ్ ప్రోత్సాహంతో ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఏర్పాటు చేసిన ‘మిల్లెట్ బౌల్’ స్టార్టప్.. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఉత్పత్తుల విక్రయాల్లో దూసుకెళ్తున్నది. చిరుధాన్యాలతో కొత్త ఉత్పత్తులను రూపొందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్న ఈ సంస్థ.. రాగులు, కొర్రలు, సజ్జలు, అరికలు, దాల్చినచెక్క, బెల్లంతో ‘రెడీమేడ్ మిల్లెట్ డ్రింక్’ను తయారు చేసింది. యాపిల్, చాక్లెట్, మామిడి మూడు రకాల ఫ్లేవర్లతో ఈ ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. 200 మిల్లీలీటర్ల టెట్రా ప్యాకెట్ రూపంలో వీటిని తయారుచేసింది. ధర కేవలం రూ.50. ఈ రెడీమేడ్ మిల్లెట్ డ్రింక్లో ఏ, సీ, డీ, ఈ, బీ1, బీ2, బీ6 విటమిన్లు, క్యాల్షియం, జింక్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు లభిస్తాయి.
25 రకాల ఉత్పత్తులు
చిరుధాన్యాలతో ఈ సంస్థ 25 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నది. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించేందుకు 150 గురుకుల పాఠశాలలు ఈ సంస్థతో ఒప్పందం చేసుకోగా.. 2016-17 నుంచి ఆయా పాఠశాలలకు చిరుధాన్యాల ఉత్పత్తులను మిల్లెట్ బౌల్ సరఫరా చేస్తున్నది. ప్రముఖ కార్పొరేట్ ఆహార ఉత్పత్తుల సంస్థ ‘నెస్లే’ ఈ సంస్థ ఉత్పత్తులపై సొంతంగా పరిశోధన చేయించి, ఒప్పందం చేయించుకొనేందుకు ముందుకు వచ్చింది. ఓ ప్రముఖ ఔషధాల కంపెనీ తమ బ్రాండ్తో ఈ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొనేందుకు చర్చలు జరుపుతున్నది.
హైదరాబాద్లో 500 స్టోర్లలో విక్రయాలు
హైదరాబాద్లోని సైనిక్పురి కేంద్రంగా పనిచేస్తున్న మిల్లెట్ బౌల్.. నగరంలోని 500 స్టోర్ల ద్వారా దీని ఉత్పత్తులను విక్రయిస్తున్నది. ఈ సంస్థ ఏటా 50 మంది రైతులకు మద్దతు ధర కల్పించి చిరుధాన్యాలను సేకరిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంస్థ ద్వారా 30 మందికి ఉపాధి లభిస్తున్నది.
టీహబ్, తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం
‘మిల్లెట్ బౌల్’ అనతికాలంలోనే ఆదరణ పొందింది. ఇందులో టీహాబ్, తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహాం చాలా ఉన్నది. 2022-23లో టీహాబ్ నుంచి సంస్థకు రూ.25 లక్షల ప్రోతాహాం, ఎంఎస్ఎంఈ కింద రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందింది. హైదరాబాద్లోని మెడ్ప్లస్, విజేత సూపర్మార్కెట్లలో మా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. త్వరలో కార్పొరేట్ కార్యాలయాలకు, రత్నదీప్ సూపర్ మార్కెట్లకు సరఫరా చేస్తాం. ప్రపంచంలోనే తొలిసారిగా ‘రెడీ టు మిల్లెట్ డ్రింక్’ను అందుబాటులోకి తెచ్చాం. గత ఆరు నెలల్లో సంస్థ ద్వారా రూ.30 లక్షల మార్కెటింగ్ జరిగింది. 2023-24లో రూ.5 కోట్ల టర్నోవర్ను లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ఉత్పత్తులపై పేటెంట్కు దరఖాస్తు చేశాం.
– కేఈఆర్ సంజయ్కుమార్, ఎండీ, మిల్లెట్ బౌల్