ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 15: నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) అమలు ప్రయత్నాలను విరమించుకోకుంటే మిలిటెంట్ పోరాటాలు తప్పవని ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల్లో భాగంగా గుజరాత్, కశ్మీర్ రాష్ర్టాల ఎస్ఎఫ్ఐ నాయకులు సత్యేషా, యూసుఫ్, హకీబ్లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల ఎన్నికలను రద్దు చేయడంతో భవిష్యత్తులో దేశానికి నికార్సైన నాయకత్వం కరువవుతుందని అన్నారు. గుజరాత్ మాడల్ అంటే విద్యావ్యవస్థను ధ్వంసం చేయడమేనని మండిపడ్డారు. మైనారిటీ పరిశోధక విద్యార్థులకు అందజేసే జాతీయ ఫెలోషిప్స్ను రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ఈపీతో రాష్ట్ర బోర్డులు రద్దవుతాయని, దీంతో పేద విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్ఈపీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కాదని, నేషనల్ ఎక్స్క్లూజన్ పాలసీ అని ఎద్దేవాచేశారు. గుజరాత్లో 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని తెలిపారు. గుజరాత్లో 13 పర్యాయాలు సీబీఎస్ఈ పేపర్లు లీక్ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని చెప్పారు.