వనపర్తి : తెలంగాణ ప్రభుత్వం గ్రామీణా ప్రాంతాల్లో కల్పిస్తున్న సౌకర్యాలతో పట్టణాల నుంచి గ్రామాలకు తిరిగి వస్తున్నారని వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి మండలం చిమనగుంట పల్లిలో పల్లెనిద్రలో భాగంగా గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వనపర్తి క్యాంపు కార్యాలయంలో 70 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.20.64 లక్షల విలువైన చెక్కులను అందజేసి వారితో సహపంక్తి భోజనం చేశారు.
నల్లచెరువుపై రూ.కోటి 15 లక్షలతో, వశ్యా తండాలో రూ.84 లక్షలతో నిర్మించే సీసీ రహదారులు, మెట్ పల్లిలో రూ.45 లక్షలతో నిర్మించే సీసీ డ్రెయిన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రాజనగరం అమ్మచెరువు పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారాయని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మౌళిక వసతులు, సదుపాయాలు పెరిగాయని అన్నారు.
పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మాణంతో సౌకర్యాలు మెరుగయ్యాయని వివరించారు.మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరు అందుతుందని పేర్కొన్నారు. చెరువులు, కుంటల మరమ్మతులతో సాగునీటి వసతులు, భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు.వనపర్తి చుట్టూ ఉన్న చెరువుల పునరుద్దరణతో ప్రజలకు ఆహ్లాదంతో పాటు పట్టణంలో బోరుబావులు రీఛార్జ్ అయ్యాయని వెల్లడించారు.
రహదారుల విస్తరణ పూర్తయితే వనపర్తి మోడల్ పట్టణంగా నిలుస్తుందని పేర్నొన్నారు. అభివృద్ధి ఫలాలు పేదలకు అందాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతి నెలా 47 లక్షల మందికి ఆసరా ఫించన్లు అందజేస్తున్నామని మంత్రి వివరించారు.దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.